27-03-2025 10:30:06 PM
కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఏ విధంగా ఈ- చలాన్ వేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణ కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ నియమాలను అతిక్రమించిన వారిని గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ- చాలన్స్ ను వెంటనే చెల్లించాలని కోరారు.
జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో యువతే ఎక్కువని, ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తం చేయాలని కోరారు. లైసెన్సు, నంబర్ ప్లేట్, నంబర్ సక్రమంగా లేని, నంబర్ ట్యాంపరింగ్ కలిగిన, నంబర్ తుడిపివేసిన వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నామని, పట్టుబడిన వాహనాలపై అయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించి, తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఇకపై ప్రతి వాహన దారులు కూడా స్వతహాగా రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటిస్తూ పరిమితి వేగాన్ని మించకుండా ప్రయాణం చేస్తూ సురక్షితంగా గమ్యాలకు చేరే విధంగా ప్రయాణించాలని కోరారు.