15 April, 2026 | 6:42 PM

ఆంగ్ల అధ్యాపకుడికి డాక్టరేట్ ప్రదానం

26-11-2025 08:48 PM

వనపర్తి టౌన్ : వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఆంగ్ల అధ్యాపకుడు ఎండి మహబూబ్ పాషా ప్రతిష్ఠాత్మకమైన సన్‌రైజ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ బిరుదును అందుకుని విశిష్ట గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆంగ్ల సాహిత్యంలో ప్రముఖ కవుల కవిత్వం, వారి రచనా శైలి, భావవ్యక్తీకరణ, సాహిత్య సామాజిక సందర్భాలపై ఆయన చేసిన లోతైన పరిశోధనను విశ్వవిద్యాలయం అత్యంత ప్రశంసించింది. భాషపై తనకున్న అభిరుచి, సాహిత్యంపై అపారమైన ప్రేమే ఈ పరిశోధనకు ప్రేరణయి నిలిచిందని డా.మహబూబ్ పాషా తెలిపారు. విద్యార్థులకు బోధన చేస్తూనే తన శాస్త్రీయ పర్యవేక్షణలో పరిశోధనను పూర్తి చేయడం సవాలుతో కూడుకున్నదైనా, అది తనకు ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు.

ఆంగ్ల సాహిత్యం పట్ల యువతలో ఆసక్తి పెంపొందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా తన పరిశోధన ప్రయాణంలో తోడ్పాటును అందించిన గురువులకు, సహచర ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, అలాగే అన్ని సందర్భాల్లో ధైర్యం నింపుతూ నిలిచిన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.  విద్యారంగానికి తన వంతు సేవలను మరింత విస్తరించాలనే సంకల్పంతో ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానిక విద్యావేత్తలు, ప్రజా ప్రతినిధులు, సహచర ఉపాధ్యాయులు ఆయనకు ఈ విజయంపై అభినందనలు తెలియజేశారు.