08-06-2025 01:25:23 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మృగశిర కార్తె రోజున చేపలను వండుకొని తినడం ఆనవాయితీగా కొనసాగిస్తున్న వారికి ఈసారి ధరాఘాతంతో కక్కలేక మింగలేక పోయారు. చేపల విక్రయ దారులు ఒక్కసారిగా చేపల ధరను రెట్టింపు చేయడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నిన్న మొన్నటి వరకు సాధారణ రకం బొచ్చ, రవు, బంగారు తీగ, గ్యాస్ కట్ చేపలు కిలో 150 రూపాయల వరకు విక్రయించగా ఆదివారం మృగశిర కార్తె సందర్భంగా ఒక్కసారిగా 250 నుంచి 300 రూపాయలకు పెంచి విక్రయించడంతో మాంసాహారులు నిరుత్సాహానికి గురయ్యారు.
అయినప్పటికీ చేసేదేమీ లేక మృగశిర కార్తె రోజున కచ్చితంగా చేపలు తినాలని ఆనవాయితీ కోసం ధర ఎక్కువైనా చేపలను కొని తీసుకువెళ్లి వండి తిన్నారు. పట్టణ ప్రాంతాల్లో మార్కెట్లకు వెళ్లగా, గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల వద్దకు జనం బారులు తీరారు. చాలా చోట్ల జనం పెద్ద ఎత్తున చెరువుల వద్దకు చేరడంతో చెరువు నుంచి చేపలు ఇలా పట్టుకురావడం, అలా విక్రయించడం జరిగింది.