25-06-2025 06:38:10 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మత్తు పదార్థాల వినియోగంతో యువత బంగారు భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందని షీ టీం ఎస్సై సునంద(She Team SI Sunanda) అన్నారు. మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో షీ టీం ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో డ్రగ్స్ నియంత్రణ వారోత్సవంలో భాగంగా విద్యార్థులకు మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సునంద మాట్లాడుతూ... విద్యార్థులు మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండాలని, చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులు ఆపద సమయంలో డయల్ 100 కు కాల్ చేయాడం ద్వారా పోలీస్ సహాయం పొందవచ్చని సూచించారు.
మాదకద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులని వదిలేసి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారన్నారు. విద్యార్థులందరూ ఇటువంటి మాదకద్రవ్యాల సేవనం ఉచ్చులో పడకుండా తమ భవిష్యత్తును సక్రమ మార్గంలో నడిపించే చదువు పైన దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అందుకోవాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో వినియోగించినా రవాణా చేసినా ఉత్పత్తి చేసినా ఇతరులను సేవించమని ప్రేరేపించిన కుట్ర అట్టి సమాచారాన్ని పోలీసులకి తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ సిరి నాయక్, ఉమెన్ సెల్ ఎస్ఐ ఆనందం, షీ టీం సిబ్బంది రమేష్, పార్వతి, సౌభాగ్య, సుప్రజ పాల్గొన్నారు.