14-08-2025 08:17:50 PM
హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ డీఈవో జ్ఞానేశ్వర్(DEO Gyaneshwar) ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిని ఎంఈఓల సమావేశంలో దూషించడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్(Telangana Students Federation) రాష్ట్ర అధ్యక్షులు కన్నం సునిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని వరంగల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డీఈవో దిష్టి బొమ్మ తగులబెట్టి ఆయన మాట్లాడారు. డీఈవోపై సమగ్ర విచారణ జరిపి ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డీఈవో జ్ఞానేశ్వర్ నోటి దురుసు ప్రవర్తనతో ఎవ్వరిని లెక్క చేయకుండా ఏఎంఓ, సుజన్ తేజ్ ను దుర్భాషలాడిన వరంగల్ డీఈవో(అ) జ్ఞానేశ్వర్ ను వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
జ్ఞానేశ్వర్ తన అధికారిక కార్యాలయాన్ని పక్కన పెట్టి, ఇంటినే ఆఫీసుగా మార్చుకుని అధికారిక పనులు చేయడమే కాకుండా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఫైల్స్ పరిష్కారంలో అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. డిగ్రీ బి.కాం క్యాడిడేట్, డీఎస్సీ పోటీ పరీక్షలు రాయకుండా, కారుణ్య నియామకంలో ఉద్యోగం పొందిన ఎ డి పోస్ట్ గా విధులకు వరంగల్ జిల్లాకు వచ్చారని, డీఈవో జ్ఞానేశ్వర్ కు అర్హత లేని అసమర్థత ఉన్న వ్యక్తి ఉపాధ్యాయుడి విలువలు ఏమి తెలుస్తుందని విమర్శించారు. డీఈఓ పై ఉన్నతాధికారులు, కలెక్టర్ డి ఎస్ సి కమిషనర్ నవీన్ నికోలస్ వెంటనే చర్యలు చేపట్టి పదవి నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తొలగించని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో డిఇఒ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు రామంచ శ్రీను, సిటీ ప్రెసిడెంట్ నాగారం మని తేజ, బన్నీ, రోహిత్, అనిల్, రాకేష్, శ్రీశాంత్, మణికంఠ, సందీప్, వంశీ, భరత్, జగపతి తదితరులు పాల్గొన్నారు.