16-09-2025 07:12:58 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): కొనసాగుతున్న వర్షాల కారణంగా మండల కేంద్రంలో పాత పెంకుటిల్లు కూలిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంట్లో నివసిస్తున్న వృద్ధ దంపతులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ అది వేణుగోపాల్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వెంటనే వారిని బయటకు తీసి అంబులెన్స్ సాయంతో గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై గంగధర అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వరుసగా కురుస్తున్న వర్షాల వలన ఇల్లు గోడలు బలహీనపడి తెల్లవారుజామున కూలిపోయాయి. దాంతో ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కేకలు విని మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు తెలిపిన ప్రకారం బాధితులకు సాధారణ రక్త గాయాలే ఉన్నాయని ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో అధికారులు వర్షాల ప్రభావంతో బలహీనంగా మారిన పాత ఇళ్ళను గుర్తించి, నివాసులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.