06-09-2025 11:31:18 PM
చండూరు,(విజయక్రాంతి): కుటుంబ పెద్ద చనిపోయిన పరిస్థితుల్లో కుటుంబానికి సహకారంగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఒకేసారి 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ పథకానికి అర్హులైన వారిని దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని ఆమె కోరారు. శనివారం ఆమె చండూరు తహసీల్దార్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 59 సంవత్సరాల లోపు వయసు ఉన్న కుటుంబ పెద్ద ఒకవేళ ఏదైనా కారణం చేత మరణించి ఉంటే జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అతిపెద్ద కుటుంబం అర్హులని, ఈ పథకం కింద అవసరమైన ధ్రువపత్రాలు జతచేస్తూ దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో వారి కుటుంబ సభ్యుల అకౌంట్లో 20 వేలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ చండూరు మున్సిపాలిటీలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులను పరిశీలించారు. మున్సిపల్ పరిధిలో దరఖాస్తులను స్వీకరణ వేగవంతం చేయాలని,జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పై మున్సిపల్ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కువమంది దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆమెసూచించారు. చండూర్ తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆమెపరిశీలించారు. చండూరు డివిజన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఆమె అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసి కేజీబీవీ పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్, వాష్ ఏరియాను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.