10-06-2025 12:25:17 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠీ
నల్లగొండ టౌన్, జూన్ 9 : విద్యుత్తు వినియోగం లేకుండా, రైతుపై ఏలాంటి ఆర్థిక భారం పడకుండా ఇందిర సౌర గిరి జల వికాస పథకం ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు.
గతంలో ఈ పథకాన్ని ఇందిర జల ప్రభ, తదితర పేర్లతో అటవీ ప్రాంతంలోని గిరిజన రైతులకు అమలు చేయడం జరిగిందని, అయితే విద్యుత్తు ద్వారా బోర్లతో సాగునీటిని అందించే పద్ధతి ఉండేదని, ఇందిర సౌర గిరి జల వికాస పథకం కింద రైతులకు ఇలాంటి ఇబ్బందులను తొలగించడం, ముఖ్యంగా ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ ఇందిర సౌర గిరి జల వికాస పథకం దోహదపడుతుందని తెలిపారు.
జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన దేవరకొండ, మిర్యాలగూడ తదితర గిరిజన ప్రాంతాలలోని 14 మండలాలలోఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ అనంతరం ఇందిర సౌర గిరి జల వికాస పథకం పై ఆమె సమీక్షించారు.
సమావేశంలో ఆర్టిఐ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అధికారులను రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు .ఈసీఐఎల్ ద్వారా దివ్యాంగులకు పంపిణీ చేయనున్న మోటార్ బ్యాటరీ సైకిళ్లు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి వై.అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, జిల్లా అధికారులు ఉన్నారు.