25-06-2025 06:01:13 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కలెక్టరేట్ ఎదుట నారాయణపురం గ్రామానికి చెందిన రైతులు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ బుధవారం ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో సుమారు 1000 ఎకరాల భూమికి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రైతు భరోసా, రైతు బీమా దక్కడం లేదని, 600 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ గ్రామం మాజీ ఎంపీటీసీ రవి ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి అనేక పర్యాయాలు తీసుకువెళ్లామని, అధికారుల దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ కొంత సమస్య తీరిందని, మిగిలిన రైతులకు కూడా ఎంజాయ్మెంట్ సర్వే ఆధారంగా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయాలని కోరాడు. రాష్ట్ర సచివాలయం ముట్టడి, కేసముద్రం రైతు వేదిక వద్ద నిరసన, కలెక్టరేట్ ఎదుట ధర్నాతో మళ్లీ ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని వాపోయాడు. రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను శాంతింప చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ కే .వీర బ్రహ్మచారికి వివిధ పత్రం అందజేశారు.