21-05-2025 12:00:00 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, మే 20 ( విజయక్రాంతి ) : రైతులకు సేంద్రీయ వ్యవసాయం అవగాహన కల్పించి ప్రోత్సహించాలనీ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం మిరాస్పల్లి వద్ద ఉన్న కొండా రెడ్డి సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి రసాయన ఎరువులు, పిచికారీలు వాడకుండా 20 ఎకరాల్లో రైతు సాగు చేస్తున్న వంగడాలను పరిశీలించారు.
ఎలాంటి ఎరువులు వాడుతా రు, ఎరువులు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ రకమైన వ్యవసాయం చేస్తున్నారు, లాభం ఎలా గడిస్తున్నారు అనే అనేక అంశాలను కలెక్టర్ రైతు కొండా రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ వ్యవసాయ రంగంలో ఇంత సాంకేతికత, నైపుణ్యం ఎక్కడి నుండి పొందారు అని రై తును ప్రశ్నించారు.
ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సాగు చేస్తున్న మామిడి, బత్తా యి, జామ, బొప్పాయి, ఇతర అంతర్గత పంటలను పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ జిల్లాలోని ఇతర పెద్ద రైతులను చూపించి సేంద్రీయ వ్యవసాయం పై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.
అదేవిధంగా పామాయిల్ సాగు వైపు రైతులను మళ్లించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయ భాస్కర్, కొత్తకోట తహసిల్దార్ వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారి, రైతు కొండారెడ్డి తదితరులు ఉన్నారు.