ఆలు చిప్స్ గోదాంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: జగద్గిరిగుట్ట శివార్లలోని పాపిరెడ్డి నగర్లోని(Papireddy Nagar) బంగాళాదుంప చిప్స్ తయారీ(Potato chips) కంపెనీ గోడౌన్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం భారీగా ఉంది. అగ్నిప్రమాదానికి అసలు కారణం తెలియనప్పటికీ, షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సూర్య ఎంటర్ప్రైజెస్ కంపెనీ గోడౌన్లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. గోడౌన్లో ప్లాస్టిక్, ఫైబర్, ఇతర మండే పదార్థాలు ఉండటంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలను పూర్తిగా ఆర్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






