పేదల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం.. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
సనత్నగర్,(విజయక్రాంతి): అర్హులైన పేద ప్రజలు తమకు లబ్ది చేకూర్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో బాలానగర్ తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని సనత్ నగర్ డివిజన్ కు చెందిన 12 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ 10, కళ్యాణ లక్ష్మి 2 ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఆడపడుచు పెండ్లి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్ధికంగా భారంతో కూడుకున్నదని చెప్పారు. వారికి కొంత చేయూత అందించి ఆదుకోవాలనే ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి KCR దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. లబ్ధిపొందిన వారు మీ పరిసరాలలోని అర్హులైన వారు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.






