01-11-2025 12:38:15 AM
టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి, అక్టోబర్ 31 :దేశంలోని రైతులకు, పేదలకు బ్యాంకులను చేరువ చేసిన ఘనత దివంగత ప్రధాని ఇందిరాగాంధీదేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొనియాడారు. శుక్రవారం ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రజల కోసం తూటాలకు బలైన రోజని తెలిపారు. బ్యాంకులను ప్రజల బ్యాంకుగా మార్చి పేదలకు చేరువ చేసిందన్నారు.
ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చి దేశంలో భూమి లేని పేదలకు భూములు పంచిన చరిత్ర ఇందిరా గాంధీదన్నారు. తాను బలై పోతానని తెలిసి దేశ ప్రజల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ధైర్యవంతురాలని కొనియాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కుటుంబానిది త్యాగాల చరిత్రని, వారు త్యాగాలు చేసే సమయంలో మోడీ, అమిత్ షా, కేసీఆర్ లాంటి వాళ్ళంతా ఎక్కడున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్ పెయి సైతం ఇందిరాగాంధీని అపర కాళీగా కొనియాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.