01-11-2025 12:45:41 AM
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): పెండింగ్ బకాయిలు, బిల్లు లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖకు సంబం ధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది. అక్టోబర్ మాసానికి సంబంధించి సుమారు రూ.1,032 కోట్లను ఒకేసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థికశాఖ అధి కారులు విడుదల చేశారు. శుక్రవారం ప్రజా భవన్లో ఆర్థికశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల బకాయిలను దశలవారీగా ప్రభుత్వం క్లియర్ చేస్తుందని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా అక్టోబర్ మాసానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లను డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థికశాఖ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా రూ.10 లక్షలలోపు పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించి 46,956 బిల్లులకు సంబంధించి రూ.320 కోట్లను కూడా విడుదల చేశారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన రూ.10 లక్షల లోపు విలువగల 3,610 బిల్లుల మొత్తం సుమారు రూ.95 కోట్లను సైతం విడుదల చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం రూ.225 కోట్లను విడుదల చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.