21-10-2025 12:10:02 PM
ముంబై: ముంబయిలోని బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి వేడుకల సందర్భంగా సోమవారం రాత్రి వాషి సెక్టార్-14లోని రహేజా రెసిడెన్సీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మందికి గాయాలయ్యయి. స్థానికుల సమాచారంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మంటలు షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించాయని, బహుళ అంతస్తుల భవనంలోని 10వ, 11వ అంతస్తులో మంటలు చెలరేగి, పై అంతస్తులకు వ్యాపించాయని, అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.
మృతుల్లో ఆరేళ్ల బాలిక వేదిక సుందర్ బాలకృష్ణన్ కూడా ఉందని, మరణించిన ఇతరులను కమలా హిరల్ జైన్ (84), సుందర్ బాలకృష్ణన్ (44), పూజా రాజన్ (39) గా పోలీసులు గుర్తించారు. ముంబై, నవీ ముంబైలలో ఇటీవల జరిగిన వరుస అగ్ని ప్రమాదాల తర్వాత ఈ సంఘటన జరిగింది. సోమవారం, ముంబైలోని కఫే పరేడ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 15 ఏళ్ల బాలుడు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అంతకుముందు, ముంబైలోని కోస్టల్ రోడ్లో కారు మంటలు, కండివాలిలో వంట గ్యాస్ సిలిండర్ పేలుడు కూడా ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా పండుగ వేడుకల సమయంలో విద్యుత్ పరికరాలు, గ్యాస్ ఉపకరణాలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు నివాసితులకు సూచించారు.