22-10-2025 01:32:13 AM
కరీంనగర్, అక్టోబర్21 (విజయ క్రాంతి): మంత్రులు అడ్లూరి లక్ష్మణ్కుమార్, శ్రీధర్బాబు తన మానసిక క్షోభకు కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆవేదనవ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నన్ను మేకలా బలిచ్చారని వ్యాఖ్యానించారు. తన కు ఏ పదవులు అవసరం లేదని తెలిపారు. ఇక నుంచి కార్యకర్తలను కాపాడుకోవడమే తన పని అన్నారు.
పార్టీ ఫిరాయించి వచ్చినోడికి ప్రాధాన్యత ఇస్తారా? అంటూ జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వారిని పట్టించుకోరా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించి నోడికి ఇప్పటికీ సభ్యత్వం లేదంటూ పరోక్షంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమా ర్పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదు.. పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు.
పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ మొదటి నుంచి ఉన్నవారిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు నేరుగా ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాలో హాట్ టాపిక్గా మారింది. సంజయ్కు పదేళ్లు దోచుకున్న అనుభవం ఉందని ఆయన మాటలే వింటారా? అంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు.
తాము వలస వాదులం కాదంటూ తాజాగా పార్టీలోకి చేరి పదవులు అనుభవిస్తున్న వారిపై మాజీ మంత్రి చురకలు అం టించారు. మంత్రి శ్రీధర్బాబు, అడ్లూరి అడ్డుకోకపోతే ఆ రోజే కథ వేరుగా ఉండేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో కౌలుదారులం కాదు పట్టాదారులమంటూ వ్యాఖ్యానించారు.
రాత్రులు నిద్రపట్టడం లేదు
ఒక్కోసారి రాత్రులు నిద్ర కూడా పట్టని పరకిస్థితి నెకొందని జీవన్రెడ్డి అన్నారు. ‘తమను కొద్దికొద్దిగా చంపకండి.. ఒకేసారి నరికేసే నిర్ణయమైనా తీసుకోండి’ అని ఆవేదనతో అన్నారు. వసలదారుల్లా దోచుకునే వారిమి కాదని పదవులు ఉన్నా.. లేకపోయిన పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తామని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. జీవన్రెడ్డ ఆవేదనను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి అడ్లూరి తెలిపారు.
ఇష్టం లేకుంటే వెళ్లగొట్టండి
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా కింద పోరాడుతున్నాయని మాజీ మంత్రి చెప్పారు. పార్టీలో నిజమైన కార్యకర్తలను పక్కనబెట్టి బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని జీవన్రెడ్డి మండిపడ్డారు. ఏ పనులు అయినా సరే వారికే కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఒక్క పెంబట్ల దేవాలయ కమిటీ తప్ప అన్ని ఆలయ కమిటీలను బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకే ఇచ్చారని ఆరోపించారు.
పొలాస పౌలస్తేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యుడిగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే అనుచరుడికి ఇచ్చారని తెలిపారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సలహాదారులకు దేవస్థానం కమిటీలో స్థానం కల్పిం చారని చెప్పారు. ఇలా అయితే పార్టీలో మా పరిస్థితి ఏంటి మంత్రిని నిలదీశారు. మీకు ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వెళ్లగొట్టండి అని అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో వలసవాదుల ముందు తలవంచను అని స్పష్టం చేశారు.