27-11-2025 12:25:56 AM
ముషీరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 46 వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృ తం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 46 జీవోను తక్షణమే రద్దు చేసి, సర్పంచుల ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బషీర్ బాగ్ చౌరస్తా లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు వినూత్న తరహాలో నిరసన చేపట్టారు. సంఘం నేతలు నీల వెంకటేష్ ముదిరాజ్, జిల్లపల్లి అంజి నేతృత్వంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా జీవో 46 ను తీసుకొచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ అర్హుడు కాదని, మాట నిలబెట్టుకోలేదని అన్నారు. బీసీలను నట్టేట ముంచి వారిని విద్యా, ఉద్యోగ, రాజకీయ పరంగా అణచి వేసే రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని విమ ర్శించారు.
సర్పంచుల ఎన్నికలు వాయిదా వేయాలని, లేనిపక్షంలో బీసీ ప్రజాప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు జి. అనంతయ్య టి. రాజ్ కుమార్, మల్లేష్ యాదవ్, మోదీ రాందేవ్, సీ. రాజేందర్, లత సింగ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.