24-01-2026 03:14:58 PM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహబూబ్నగర్ నగరం ను క్లియర్ సిటీ, సేఫ్ సిటీగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్నగర్ నగరంలో ముడా నిధులతో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికతనే మహబూబ్నగర్ నగరంలో కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
నగరంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే గుర్తించి, ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని పరిష్కరించేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ వ్యవస్థను మరింత విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ వారోత్సవాల సందర్భంగా రహదారుల భద్రతపై ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి వాహనచోదకుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. ఈ భద్రతా సూచనలు స్కూల్, కాలేజీ విద్యార్థులకు చేరవేయాలని అధికారులకు సూచించారు. "ప్రతి ఒక్కరూ ప్రాణం విలువను తెలుసుకోవాలన్నారు.
గత రెండేళ్లుగా నగరంలో క్రైం రేట్ కూడా భారీగా తగ్గిందన్నారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్ విషయంలో తప్పు చేసిన వారు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే నగరంలో పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నగరంలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సిబ్బందిని పెంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి. జానకి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సుందరీకరణ కమిటీ చైర్మన్ పోల శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడర్ రఘు, దేవేందర్ నాయక్, తిరుపతి నాయక్, పోలీసు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.