calender_icon.png 19 June, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గూగుల్, హైదరాబాద్ పాత దోస్తులే!

19-06-2025 01:36:30 AM

  1. కాంగ్రెస్ హయాంలో 2007లోనే తొలి కార్యాలయం ఏర్పాటు 
  2. మీది ఇన్నోవేటివ్ కంపెనీ.. మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వం 
  3. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు గూగుల్ మద్దతు అవసరం 
  4. పెట్టుబడి అనుకూల రాష్ట్రానికి చిరునామా తెలంగాణ 
  5. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీయే లక్ష్యం 
  6. గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్(జీఎస్‌ఈసీ) ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి 
  7. జీఎస్‌ఈసీ ఏర్పాటుతో హైదరాబాద్ ఐటీరంగం మరింత ఉన్నత శిఖరాలకు..: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ‘మీది ఇన్నోవేటివ్ సంస్థ అని, మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వం’ అని గూగు ల్ సంస్థను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గూగుల్, హైదరాబాద్ పాత స్నేహితులేనని, 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తమ మొద టి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని సీఎం గుర్తుచేశారు. చెడు చేయవద్ద న్నది గూగుల్ సిద్ధాంతమని, ఈ విధానాన్ని తానెంతో ఇష్టపడతానని తెలి పారు.

గూగుల్‌లాగానే తమ ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నానని వెల్లడించారు. ఈ విధానంలో ఫలితాలు నెమ్మదిగా కనిపిస్తాయని, కానీ మనం దీర్ఘకాలికంగా దృష్టిపెట్టి పనిచేయాలని సూచించారు. ప్రముఖ ఐటీ దిగ్గజమైన గూగుల్ కంపెనీ తమ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్(జీఎస్‌ఈసీ)ను బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి హైదరాబాద్‌లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జీఎస్‌ఈసీని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డికి తమ పనితీరును గూగుల్ సిబ్బంది వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని, మన జీవితాలు పూర్తిగా డిజిటల్‌గా మారాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం అందరూ గోప్యత, భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని, డిజిటల్ భద్రతతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ సంస్థ ఈ సైబర్ సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. 

సెర్చ్‌లో మొదటి లింక్ హైదరాబాదే..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పె ట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే తె లంగాణ అని సమాధానం వస్తుందని, తమకు సె ర్చ్‌లో మొదటి లింక్ హైదరాబాద్ అనే వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దీ న్ని తాము తెలంగాణ రైజింగ్ అని పిలుస్తామ ని తెలిపారు.

2035 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని చె ప్పారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నామని, భవిష్యత్‌లో తెలంగాణ మహిళలే గూగుల్ సంస్థకు పోటీదారులు అవుతారని చమత్కరించారు. 

తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లు..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు గూగుల్ మద్దతు అవసరమని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్‌కు గూగుల్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ కావాలని కోరుకుంటున్నట్టు సీఎం చెప్పారు. దాదాపు 7వేల మంది గూగుల్ ఉద్యోగులు ప్రస్తుతం హైదరాబాద్‌ను తమ సొంత ఇంటిలా భావిస్తున్నారని స్పష్టం చేశారు.

విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం వంటి అనేక రంగాల్లో గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్‌మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేశామని వివరించారు. 

హైదరాబాద్ నగరం కాదు భవిష్యత్: మంత్రి శ్రీధర్‌బాబు

భావితరాల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్‌ను నిర్మించాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ ‘ఎథికల్ ఇన్నోవేషన్’లో ఇతర రాష్ట్రాలకు టార్చ్‌బేరర్‌గా దిశానిర్దేశం చేస్తుందని, మాగ్నెట్ ఫర్ గ్లోబల్ కేపిటల్‌గా ఎదిగిందని, మోడల్ ఆఫ్ ఇన్‌క్లూసివ్ డిజిటల్ గవర్నెన్స్‌గా మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.

హైదరాబాద్ అంటే నగరం కాదని, ఒక భవిష్యత్ అని స్పష్టం చేశారు. 2024-25లో హైదరాబాద్ నుంచి రూ. 2.68లక్షల కోట్ల విలువైన ఐటీ సేవలు ఎగుమతి అయ్యాయని తెలిపారు. 40 వేల మందికి కొత్తగా ఐటీ ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. జీఎస్‌ఈసీ హైదరాబాద్ ఐటీరంగాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని బలంగా విశ్వస్తున్నట్టు తెలిపారు. ఏఐ యుగంలో సైబర్ సెక్యూరిటీ సవాలుగా మారిందన్నారు.

ఇలాంటి తరుణంలో భారత్‌లో, అందులోనూ హైదరాబాద్‌లో ఆసియాలోనే మొదటి జీఎస్‌ఈసీని ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంతో అవసరమన్నారు. డిజిటల్ తెలంగాణ 2.0మాత్రమే తమ ప్రభుత్వం లక్ష్యం కాదని, సేఫ్ డిజిటల్ తెలంగాణ 2.0నే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.