11-10-2025 06:56:17 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఫలాలు నిరుపేదలకు అందలాంటే రాజకీయాలకు అతీతంగా పనులు జరగాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నిరుపేదల సొంతింటి కలలు సహకారం చేసేలా చేపడుతున్న ఇండ్ల నిర్మాణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం బోరజ్ మండలంలోని పూసాయి, మాండగడ గ్రామాలలో ఇందిరమ్మ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అంజూరైన ఇండ్లకు స్థానిక నాయకులు, లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇండ్లు లేని నిరుపేదలు ఎవ్వరు ఉండకూడదని సదుద్దేశంతో ఇప్పటికే 4 కోట్ల 80 లక్షల ఇంటి నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఈ సంవత్సరం మరో 2 కోట్ల 40 లక్షల ఇంటి నిర్మాణ కార్యక్రమం జరుగుతోందన్నారు. పేదల సొంతింటి కలను సహకారం చేసేలా భూమి పూజ చేసిన ఇండ్లకు అధికారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యాలయంలో పలువురు బీజేపీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.