15-11-2025 04:51:51 PM
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జూబ్లీహిల్స్ శాసన సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా శనివారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఎలే మల్లికార్జున్. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, రాబోయే స్థానిక సంస్థలు & జి హెచ్ ఎం సి ఎన్నికల గురించి చర్చించారు.
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల సమిష్టి కృషి అని, ప్రతి ఒక్కరు ఏకతాటిపై నిలిచి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పని చేశారని అన్నారు. ఈ గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని రాబోయే ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజా పాలనకు పట్టం కట్టారని అన్నారు. ఈ గెలుపు అభివృద్ధి పట్ల, పేదల సంక్షేమం పట్ల మరింత బాధ్యతను పెంచిందని చెప్పారు.