01-06-2025 12:52:02 AM
క్షీరదజాతిని పరిరక్షిస్తున్న కోమటిపల్లి గ్రామస్థులు
నిషాచార జీవులైన గబ్బిలాల పేరు చెబితేనే కొందరు ఏదో కీడు జీవిగా భయపడుతుంటారు. మరికొందరు వాటి రూపు చూసి ఆసహ్యంగా భావిస్తుంటారు. అయితే ఆ గ్రామస్థులు మాత్రం గ్రామంలో ఉన్న వందలాది గబ్బిలాల పట్ల మమకారాన్ని చాటుతున్నారు. దీంతో అరుదైన క్షీరద జాతికి చెందిన వందలకొద్ది గబ్బిలాలు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయం, చెరువుకట్టపై ఉన్న రావి, మర్రిచెట్లను అనేక సంవత్సరాల నుంచి ఆవాసంగా చేసుకొని జీవిస్తున్నాయి.
ఎక్కడ కూడా ఇంత పెద్దసంఖ్యలో గబ్బిలాలు కనిపించవు. ఈ గ్రామంలో మాత్రం వందలాది గబ్బిలాలు కనిపిస్తాయి. రెండేళ్ల క్రితం వేసవి తాపానికి గబ్బిలాలు మృత్యువాత పడుతుండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా గబ్బిలాలు నివసించే చెట్ల వద్ద కూలర్లు ఏర్పాటు చేయడం విశేషం. అరుదైన క్షీరద జాతిని, జీవవైవిధ్యాన్ని సంరక్షిస్తూ కోమటిపల్లి వాసులు ప్రత్యేకత చాటుకుంటున్నారు.
సంపత్ కుమార్, మహబూబాబాద్