01-06-2025 12:54:53 AM
30ఏళ్లు పైబడిన వ్యక్తులకు బీపీ, షుగర్, గుండెజబ్బులు, క్యాన్సర్కు సమగ్ర స్క్రీనింగ్, చికిత్స
ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు ఎన్సీడీ కౌన్సిలర్ల ద్వారా సేవలు
జీవనశైలి వ్యాధుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఒరవడి
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఉరుకులు పరుగుల జీవితం, మానసిక ఒత్తిడి, ధూమ పానం, మద్యపానం, నిద్రలేమి తదితర సమస్యల కారణంగా వచ్చే వ్యాధులే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) అని వైద్యులు పేర్కొంటున్నారు. జీవనశైలి కారణంగా వచ్చే ఈ వ్యాధులేవి అంటువ్యా ధులు కావు. ఇవి ఒక వ్యక్తి నుంచి మరొకరికి సంక్రమించని వ్యాధులు.
ఉదాహరణకు డయాబెటిస్, రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటివి. అయితే ఇప్పుడు ఎస్సీడీ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 30 ఏళ్లు దాటిన వారిలో ఈ ఎన్సీడీ లక్షణాలు కనిపి స్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్ర భుత్వం ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా జీవనశైలి వ్యాధుల నివారణతో పాటు తొలిదశలోనే గుర్తింపునకు ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో 35 ఎన్సీడీ క్లినిక్స్ ప్రారంభించింది.
రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 33 జనరల్ హాస్పిటళ్లతో పాటు హైదరాబాద్లోని కింగ్కోటి జిల్లా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్లో ఈ క్లినిక్లు ప్రారంభమయ్యాయి. ఈ క్లినిక్స్ ప్రజలకు ఎన్సీడీపై అవగాహన కల్పించడంతో పాటు, ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
సమగ్ర స్క్రీనింగ్, సేవలు
ఎన్సీడీ క్లినిక్లు 30 ఏళ్లు పైబడిన వ్యక్తులకు రక్తపోటు(బీపీ), డయాబెటిస్, గుండెజబ్బులు, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల స్క్రీ నింగ్ సేవలను అందిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నుంచి బీపీ, షుగర్, రోగులను ఎన్సీడీ క్లినిక్స్కు సిఫార్సు చేస్తు న్నారు. ఈ రోగులకు 102 వాహ నాల ద్వారా వారం లో ఒకసారి జనరల్ హాస్పిటళ్లకు తరలించి, నిపుణులైన వైద్యులతో చికిత్స అందిస్తున్నారు.
ఈ క్లినిక్స్లో బీపీ, షుగర్ పరీక్షలతో పాటు సమగ్ర డయాగ్నస్టిక్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. నమూనాలను క్లినిక్లోని ల్యాబ్ టెక్నీషియన్ సేకరించి, సమీపంలోని తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్కు పంపిస్తారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు ఎన్సీడీ కౌన్సిలర్లు రోగులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ ఎన్సీడీ క్లినిక్లో ముగ్గు రు స్టాఫ్నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్ పనిచేస్తున్నారు.
కొన్ని క్లినిక్స్లో కౌన్సిలర్, ఫిజియోథెరపిస్టులు కూడా ఉన్నా రు. జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, డెంటిస్ట్లు రోగులకు సేవలు అందిస్తున్నారు. ఎన్సీడీ క్లినిక్లకు ఏకరూప రంగు లు, సమాచార బోర్డులు, స్క్రీనింగ్ ప్రోటోకాల్తో కూ డిన సైనేజ్లు, భారీ పోస్టర్ల ద్వారా కొత్త బ్రాండింగ్ చేశారు. ఇవి ప్రజల్లో అవగాహన పెంచడంలో సహాయపడుతున్నాయి.
వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పు
ఎన్సీడీ క్లినిక్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జీవనశైలి వ్యాధుల నివారణలో కీలక ముందడుగు వేసిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య రక్షణ మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు ఆశాభా వం వ్యక్తం చేస్తున్నారు.
స్క్రీనింగ్లో గణనీయ పురోగతి
ఇప్పటివరకు 1,22,617 మంది 30 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఈ ఎన్సీడీ క్లినిక్స్లో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 26,391 మంది నియంత్రణలో లేని రక్తపోటు, 43,768 మంది డయాబెటిస్తో పీహెచ్సీల నుంచి ఎన్సీడీ క్లినిక్స్కు సిఫార్సు చేయబడ్డారు. కొత్తగా 8,457 మందికి రక్తపోటు, 20,438 మందికి డయాబెటిస్ నిర్ధారణ అయింది. డయాగ్నస్టిక్ పరీక్షలలో భాగంగా 39,693 ఈసీజీలు నిర్వహించగా, 2,688 మందిలో అసాధారణ ఫలితాలు వచ్చాయి.
నోటి క్యాన్సర్ స్క్రీనింగ్లో 73,131 మంది పాల్గొనగా, 891 మంది అనుమానిత కేసులుగా గుర్తించబడ్డాయి. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్లో 37,668 మంది మహిళల్లో 336 మంది, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్లో 30,387 మందిలో 352 మంది అనుమానిత కేసులుగా గుర్తించి సిఫార్సు చేయబడ్డారు.