10-07-2025 06:29:18 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గూడూరును అసెంబ్లీ సెగ్మెంట్ గా ఏర్పాటు గూడూరు నియోజకవర్గ సాధన కమిటీ సమన్వయకర్త మేరెడ్డి సురేందర్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఏర్పాటు చేసిన గూడూరు నియోజకవర్గ సాధన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గూడూరుకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, గతంలో పరిపాలన సౌలభ్యం కోసం గూడూరుని సమితిగా, తాలూకాగా ఏర్పాటుచేసి ఇక్కడ నుండే పరిపాలన అందించినటువంటి చరిత్ర ఉందన్నారు. గూడూరుకు అన్ని రకాల వసతులు, వనరులు కూడా ఉన్నాయన్నారు.
గూడూరు కేంద్రంగా ప్రభుత్వ ఫారెస్ట్ సబ్ డివిజన్ ఆఫీస్, పోలీస్ సర్కిల్ ఆఫీస్, ఇరిగేషన్, ఐటీడీఏ విద్యాలయాలు ఉన్నాయన్నారు. డిలిమిటేషన్ లో గూడూరు కేంద్రంగా నియోజకవర్గాన్ని ఏర్పాటు వల్ల అభివృద్ధి కి మరింత దోహదపడుతుందన్నారు. గూడూరు నియోజకవర్గ ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, కుల సంఘాల పెద్దల తో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వద్దకు గూడూరు నియోజకవర్గ ఏర్పాటు అంశాన్ని తీసుకువెళ్తామన్నారు. ఈ సమావేశంలో పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, జలగం సంపత్ రావు, కటార్ సింగ్, పెనుక రామ్మూర్తి, నూకల ఉపేందర్, జోగా రణధీర్, గుండె బోయిన మల్లేష్, ముత్యం సురేష్, భాస్కర్ నాయక్, చల్పూరి శ్రీశైలం, బౌసింగ్ పాల్గొన్నారు.