27-07-2025 03:37:25 PM
హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థినిలు ఫుడ్ పాయిజనింగ్తో బాధపడుతు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నేరుగా ఉయ్యాలవాడలోని గురుకుల పాఠశాలకు వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థునులను పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థులను చూసేందుకు వస్తున్నామని నిఘా వ్యవస్థ ద్వారా తీసుకొని, వారి చేతికున్న క్యానులా కూడా తీయకుండా హడావుడిగా ఆసుపత్రి నుండి విద్యార్థులను తరలించడం దుర్మార్గమని ఆరోపించారు.
మెను ప్రకారం తిండి పెట్టడంలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మాటలు కాదు.. చేతలు కావాలని దుయ్యబట్టారు. కలుషిత ఆహారం తిని విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారని, సాంబార్ లో కూడా పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు తల్లిదండ్రులు చెప్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సారి కలుషిత ఆహారం కేసులు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పారని, ఆయన మాటలు అధికారులు కూడా వినడం లేదా అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఈ అంశంపై ఎంతవరకైనా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చించాలని డిమాండ్ చేశారు. పిల్లలకు కడుపునిండా తిండి పెట్టండి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఢిల్లీకి వెళ్లడానికి సమయం ఉంది కానీ.. విద్యార్థుల సమస్యలపై చర్చించడానికి లేదా అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.