19-08-2025 01:44:27 AM
మంచిర్యాల, ఆగస్టు 18 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలో సోమ వారం కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి వరద నీరు పట్టణంలోని సూర్య నగర్, హమాలి వాడ, తిలక్ నగర్, బృందావన కాలనీ, సున్నం బట్టి వాడ, హైటెక్ సిటీ తదితర వాడల్లోని ఇళ్లలోకి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతా ల్లో జనజీవనం అతలాకుతలం అయ్యింది. రోడ్లపైకి నీరు చేరడంతో జనం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పట్టణానికి ఆనుకుని ఉన్న రాళ్లవాగు, తోళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాలనీలన్నీ వరద నీటితో నిండుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వర్షంలోనే జలమయమైన కాలనీలను తిరిగి పరిశీలించారు.
ఎంసీహెచ్ చుట్టూ చేరిన వరద నీరు
కాలేజీ రోడ్ లోని ఎంసీహెచ్ చుట్టూ వరద నీరు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుండి వరద నీరు వస్తుండడంతో ఆసుపత్రిలోకి రావడానికి, బయటకు వెళ్లేందుకు రోగులు, అటెండర్ లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు విష సర్పాలు ఆసుపత్రి వరకు వస్తుండటంతో ఎక్కడ నుంచి ఏమి వస్తాయోనని భయం గుప్పిట్లో గడుపుతున్నారు.
నివాసాల్లోకి వరదనీరు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
కుమ్రంభీం అసిఫాబాద్, ఆగస్టు (విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా వరద నీరు నివాస ప్రాంతాలకు చేరకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం రెబ్బెన మండల కేంద్రంలో గల ఎన్.టి.ఆర్. కాలనీ, రెబ్బెన గ్రామంలో పర్యటించి వరద ప్రభావిత ప్రాం తాలను పరిశీలించారు.