18-10-2025 12:38:26 AM
-ఓ రైతు పొలంలో గుర్తింపు
-ఇలాంటివి ఇదే ప్రథమం అన్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం
మెదక్, అక్టోబర్ 17(విజయక్రాంతి) : మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలోని వెంకటాయపల్లి గ్రామ శివారులో రైతు చంద్రయ్య భూమిలో చారిత్రక రాతిచిత్రాల తావును కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. ఈ తావును బృందం సభ్యులతో కలిసి కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్, కో-కన్వీనర్లు శ్రీరామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీశ్ మిత్రుడు కె.జయంత్ శుక్రవారం సందర్శించి, రాతిచిత్రాలను విశ్లేషించారు.
రెండు రాతిగుండ్ల మీద పేర్చిన ఈ శిలాశ్రయం నేలమీదనే ఉందని, ఇక్కడ కనిపించిన రాతిచిత్రాలు ఎరుపురంగులో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో ఎడమవైపు రాతిగుండుపై వేసిన చిత్రాలలో ఒక దేవుని రథం, దానికి కట్టిన రెండెద్దులు, ఒకవైపు ముగ్గుపట్టీ అలంకరణ, మరొకవైపు తీగలవాద్యాన్ని భుజంపై పెట్టుకుని వాయిస్తున్న కళాకారుడు ఉన్నారని చెప్పారు. కుడివైపు రాతిగుండు మీద ఒక రాక్షసుని వంటి బొమ్మ, మరొకటి వీరుని బొమ్మ, వీటికి పైన పెద్దతోక గల కోతిబొమ్మ ఉన్నాయని, అన్నింటిపైన సర్పం వంటి పొడవైన గీతగీసి ఉందని వివరించారు.
రాతిచి త్రాలలో తంత్రీవాద్యంతో కళాకారుడు కనిపించడం ఇదే ప్రథమం అని బీవీ భద్రగిరీశ్ తెలిపారు. ఈ రాతిచిత్రాలన్నీ మధ్య చారిత్రక కాలానికి చెందినవనిగా ఉన్నాయని శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. రాతిచిత్రాల తావుకు 50అడుగుల దూరంలో మధ్యరాతియుగానికి చెందిన సూక్ష్మరాతిపనిముట్లు (మైక్రోలిథ్స్) దొరికినట్టు, మరికొం చెం దూరంలో పెద్దరాతి గుండు మీద పట్టీల వంటి గీతలు, మనిషి రూపం పెట్రోగ్లైఫ్స్ ఉన్నట్టు వారు తెలిపారు.