07-01-2026 12:36:24 AM
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): పోలవరం- నల్లమల సాగర్ అనుసంధానం అంశంపై సుప్రీంకోర్టు తదుపరి విచారణకు స్వయంగా తానే హాజరవుతానని, అంతకు ముందు ఢిల్లీ వెళ్లి సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీతో భేటీ అవుతానని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం- నల్లమలసాగర్ లింక్ విషయంలో సుప్రీం కోర్టు మూడు నాలుగు సూచనలు చేసిందని గుర్తుచేశారు.
ఈ అంశంపై మళ్లీ తమ ప్రభుత్వం ఆయా ప్రాజెక్ట్లపై మధ్యంతర స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టునే కోరాతమని తేల్చిచెప్పారు. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల మరమ్ముతులపై.. ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, మంత్రి స్పందించారు. ఇప్పటివరకు తాము ఎలాంటి డిజైన్ కన్సల్టెన్సీని ఇంకా ఖరారు చేయలేదని మంత్రి తేల్చిచెప్పారు. ప్రభుత్వ నిబంధనలు పరిగణలోకి తీసుకుని, ఆయా సంస్థల గత విజయాలను బేరీజు వేసే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.