11-07-2025 12:39:05 AM
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ
ఆదిలాబాద్, జూలై 10 (విజయక్రాంతి ) : ఆదివాసీ బిడ్డ, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి సీతక్కను విమర్శించే స్థాయి మాజీ ఎంపీ మాలోతు కవిత, తుల ఉమకు లేదని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగు ణ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో ఆమె మాట్లాడారు. కేటీఆర్ మెప్పు కోసమే మంత్రి సీతక్కపై ఉమ, కవిత అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సాటి ఆడబిడ్డ అని చూడ కుండ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాటిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేవలం సీతక్క మీద పనిగట్టుకొని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకుల వేధింపులకు అనేక మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సూసైడ్ లేఖలు, సెల్ఫీలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.
సిరి సిల్లలో లారీలతో తొక్కించిన చరిత్ర మీదని విమర్శలు గుప్పించారు. జీవో 49 టైగర్ కారిడార్కు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో సీతక్క మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో జీఓ నెంబర్3ని రద్దు చేస్తే వారిద్దరూ ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోసారి సీతక్కపై అవాకులు, చెవాకులు పేలుతూ నోరు పారేసుకుంటే ఖబద్ధార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సునీల్ జాదవ్, నాయకులు గిమ్మ సంతోష్, గుడిపల్లి నగేష్, నర్సింగ్, సంతోష్, శ్రీలేఖ, రఫీక్, అశోక్, ప్రశాంత్ పాల్గొన్నారు.