23-08-2025 04:26:03 PM
కాగజ్ నగర్ (విజయక్రాంతి): పనుల జాతర పేరిట పంచాయతీ రాజ్ శాఖలో ప్రహసనం మొదలైందని సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు(MLA Dr. Palvai Harish Babu) విమర్శించారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క రూ.2200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు అని ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతూ కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు. గ్రామ పంచాయతీలలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి లేదని అన్నారు. గత 18 నెలలుగా గ్రామపంచాయితీలకు ఒక్క రూపాయి ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం, పనుల జాతర అని ఒక డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు ఏం చేశారో చెప్పాలని మంత్రి సీతక్క కు సవాల్ విసిరారు. పనుల జాతరలో ఏఏ పనులు చేపడుతున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఎన్నికల కోసం కాంగ్రెస్ మార్కు రాజకీయమని ఎద్దేవా చేశారు.