18-08-2024 12:00:00 AM
కోల్కతాలో పీజీ వైద్యవిద్యార్థినిపై హత్యాచారం ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమకు రక్షణ కల్పించేందుకు చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను బహిష్కరించి ఒక రోజు సమ్మె కూడా చేశారు. డాక్టర్లది న్యాయమైన డిమాండే. జరిగిన ఘటన కూడా దారుణమైనదే. కానీ దీనిపై తక్షణం స్పం దించాల్సిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఈ వ్యవహారాన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్లు మాత్రం లక్షలాది మంది నిరుపేద ప్రజలే.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలు వైద్య సేవల కోసం మైళ్ల దూరం ప్రయాణించి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుం టారు. అయితే వారు వచ్చే సమయానికి ఓపీ విభాగంలో వారిని పరీక్షించే వారు కానీ, కనీసం చీటీ ఇచ్చే వాళ్లు కానీ లేకపోతే ఎంత బాధపడతారో అర్థం కాదు. అంతేకాదు. దేశవ్యాప్తంగా ప్రతి ఊళ్లోను ఇప్పుడు పదుల సంఖ్యలో జనం విషజ్వరాల బారిన పడి మంచమెక్కుతున్నారు. కనుక పేదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకు నైనా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఈ సమస్యకు తక్షణ పరిష్కారం ప్రకటిస్తే బాగుంటుంది.
మధుకర్, ఘట్కేసర్