తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి..

26-04-2024 02:09:30 AM

l 1985 నుంచి హస్తం  పార్టీలో క్రియాశీల పాత్ర 

l ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి ప్రస్థానం

ఖమ్మం, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): నామినేషన్ల గడువు ముగుస్తుందనగా ముందు రోజు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. రామసహాయం రఘురాంరెడ్డిని ఎంపీ బరిలో నిలిపింది. రఘురామ్‌రెడ్డి 1961 డిసెంబర్ 19న రామసహాయం సురేందర్ రెడ్డి, జయమాల దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు. కాగా వీరి స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ. ఆయన హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో బీకామ్, అనంతరం పీజీ డిప్లొమా పూర్తి చేశారు. ప్రస్తుతం వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈయన తండ్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోనే పుట్టి పెరిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా,  వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. 

రఘురామ్‌రెడ్డికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు వినాయక్‌రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్‌రెడ్డి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని వివాహం చేసుకున్నారు. తండ్రి సురేందర్‌రెడ్డి స్ఫూర్తితో ఒక వైపు వ్యాపారాలు చేస్తూనే.. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దివంగత ప్రధానమం త్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులతో వీరి కుటుంబానికి సాన్నిహిత్యం ఉండేది. సురేందర్‌రెడ్డి కూసుమంచి మండలంలోని జీళ్ళచెర్వు, చేగొమ్మ, ముత్యాలగూడెం గ్రామాలకు, ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామానికి పోలీస్ పటేల్‌గా పనిచేశారు.

1985లో జరిగిన ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా, 1989, 1991లో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు, వరంగల్ లోక్‌సభకు ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి 2012లో రాజ్యసభకు, 2014లో ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయగా చివరి నిమిషంలో అవి వేరే వారిని వరించాయి. 2014లో పాలకుర్తి, 2018లో పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. రఘురామ్‌రెడ్డి 2011 హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ ) ప్యాటరన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్‌చైర్మన్‌గా,హైదరాబాద్ రేస్ క్లబ్‌లో బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

రఘురామ్‌రెడ్డితో పాటు వారి తాతముత్తాతలు సేవాదృక్పథ కుటుంబానికి చెందినవారు. మరిపెడ బంగ్లాలో ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలుగా కొనసాగుతున్న మార్కెట్ యార్డు, పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీవో, ఆర్టీసీ బస్టాండ్, పీహెచ్‌సీలు, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలు, టీటీడీ కల్యాణ మండపాలకు దశాబ్దాల కాలం కిందటే ఉచితంగా స్థలాలను కేటాయించారు. వరంగల్‌లో రెడ్డి ఉమెన్స్ హాస్టల్‌ను నిర్మించారు. అనేక ప్రాంతాల్లో రామాలయాలు, శివాలయాలు, వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు. వారి స్వగ్రామమైన పాలేరు నియోజకవర్గంలోని  కూసుమంచి మండలం చేగొమ్మలో వారి ఇంటిని, 6 ఎకరాల్లో ఉన్న గడీని ప్రభుత్వ పాఠశాల, ఇంకా ఇతర ప్రభుత్వశాఖల భవనాల కోసం ఉచితంగా ఇచ్చారు.