జనవరి 1 నుంచి భారత్ ట్యాక్సీ
- పైలెట్ ప్రాజెక్టుగా ఢిల్లీలో సేవలు
- ఇప్పటికే యాప్లో 56వేల మంది డ్రైవర్ల రిజిస్ట్రేషన్
- ఎలాంటి సర్వీస్ ఛారీలు లేకుండానే సేవలు
న్యూ ఢిల్లీ, డిసెంబర్ 18 : ప్రయాణికుల సౌలభ్యం కోసం.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారత్ ట్యాక్సీ యాప్ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ రంగంలో ఉబర్, ఓలా, ర్యాపిడోల మాదిరిగానే ఈ కొత్త ట్యాక్సీ కూడా ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఈ యాప్లో సేవలందించేందుకు ఇప్పటికే సుమారు 56 వేల మంది డ్రైవర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో ఆటో రిక్షాలు, కార్లు, బైక్ ట్యాక్సీలు ప్రయాణికులకు సేవలందిస్తాయి.
దీంతో ఇదివరకు ఉన్న క్యాబ్ ఛార్జీల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా.. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ఈ సేవలను పొందే అవకాశముంది. తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీలో జనవరి 1 నుంచి ఈ యాప్ సేవలను అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొంది స్తోంది . ఆ తర్వాత దేశంలోని మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తామని తెలిపింది.




