calender_icon.png 7 June, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు నీడ కల్పించడానికే ఇందిరమ్మ ఇళ్లు

06-06-2025 01:14:00 AM

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్, జూన్ 5(విజయక్రాంతి): నిరుపేదలకు అండగా నిలబడి, వారికి నిలువ నీడ ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.

గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, హౌసింగ్ పీడీ మాణిక్యం, డిపిఓ యాదయ్య, అన్ని మండలాల ఎంపీడీవోలు పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రావు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికి నిలువ నీడను కల్పించాలని గొప్ప ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టిందన్నారు. దశలవారీగా లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతా యన్నారు.

ఈ పథకంలో భాగంగా నిరుపేదలైన అర్హులకే ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా ప్రతి మండలంలోని ఒక గ్రామం చొప్పున గత జనవరి 26న ప్రభుత్వం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిందన్నారు. మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కొనియాడారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల సొంతింటి కల ఆశయాన్ని సాకారం చేసేందుకు గాను ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని ఇల్లు నిర్మించుకునే వారు ఇంటి నిర్మాణ సామాగ్రిని ఒకేసారి కొనుగోలు చేస్తే ఖర్చు తగ్గించుకోవచ్చు అన్నారు. రూ. 5 లక్షలను ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మండలాల ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, సంబంధిత సిబ్బందిపాల్గొన్నారు.