02-12-2025 06:25:15 PM
కాటారం (విజయక్రాంతి): గ్రామ పంచాయతీలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడ్డూరి బాబు, ఎంపీఓ వీరస్వామి మంగళవారం పరిశీలించారు. మండలంలోని గ్రామ పంచాయతీలలో సర్పంచులకు, వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో మండలంలో క్లస్టర్లుగా విభజించి, ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
కేంద్రాలలో విద్యుత్తు, మంచినీటి సదుపాయాలను కల్పించారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ మేరకు ఎన్నికల సామాగ్రిని ఆయా క్లస్టర్లకు పంపిణీ చేశారు. సమన్వయ సమావేశంలో మండల తాసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో అడ్డూరి బాబు, ఎంపీఓ వీరస్వామి, ఆర్వోలు, ఏపీవోలు, కార్యదర్శులు పాల్గొన్నారు.