calender_icon.png 3 June, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ స్కామ్‌పై విచారణ!

02-06-2025 02:29:34 AM

  1. మలివిడత దర్యాప్తు దిశగా సీఐడీ దృష్టి
  2. 30మంది వాణిజ్యపన్నుల శాఖ అధికారులను విచారించనున్న సీఐడీ

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): జీఎస్టీ చెల్లింపుల్లో కుంభకోణం జరిగిందన్న అభియోగం తో నమోదైన కేసులో మలివిడత దర్యాప్తు దిశగా సీఐడీ దృష్టి సారించింది. ఇందులోభాగంగా 30 మంది వాణిజ్యపన్నుల శాఖ అధికారులను విచారించనున్నది. వంద కోట్లు, అంతకన్నా ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థల డీలర్లను, వారి పన్నుల చెల్లింపులను పర్యవేక్షించిన అధికారులను ప్రశ్నించి వాస్తవాలను నిగ్గుతేల్చడంపై దృష్టి సారించింది.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జీఎస్టీ చెల్లింపుల్లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే ఫిర్యాదుపై సీఐడీ మరింత లోతుగా దర్యాపు చేయనున్నది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్ కుమార్ జీఎస్టీ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాంప్రసాద్ ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొ.శోభన్‌బాబు 75మంది డీలర్ల వ్యాపార లావాదేవీలు కన్పించకుండా మాస్క్ వేశారని వాణిజ్య పన్నుల శాఖ పోలీసులకు ఫిర్యాదు అందింది.

దాదాపు రూ.1,400కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసును గతేడాది జూలై చివరివారంలో సీఐడీకి బదిలీచేయగా ఆగస్టు నుంచి విచారణ ప్రారంభించిన అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించారు. 

 ఈ కుంభకోణంలో ఇతర పాత్రధారులను గుర్తించేందుకు గతంలో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేసిన శ్రీదేవి నేతృత్వంలో హైలెవల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 75మంది డీలర్లలో 24మంది కేంద్ర జీఎస్టీ పరిధిలో 51మంది రాష్ట్ర జీఎస్టీ పరిధిలో ఉన్నారు. ఇం దులో 7 సంస్థల లైసెన్స్‌లు ఇప్పటికే రద్దు కాగా, 49సంస్థలకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టాలన్న అభియోగంపై సోమేశ్ కుమార్ సహా మరికొందరిపై కేసు నమోదు చేశా రు.

సీఐడీ ఎస్సీ వెంకటలక్ష్మి నేతృత్వంలో పలువురు డీఎస్పీలు, సీఐలు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. సోమేశ్‌కుమార్ మినహా మిగిలిన అధికారు లను సీఐడీ అధికారులు ఇప్పటికే విచారించారు. ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేకంగా రూపొందించిన మాడ్యుల్స్ ద్వారా పన్నులు వసూలు చేపట్టినట్టు సీఐడీ దృష్టికి రావడంతో మరింత లోతుగా దర్యాపు చేపట్టగా 2022 ఆగస్టులో జీఎస్టీ పన్నుల వసూళ్లు పెంచేందుకు అప్పటి అధికారులు 30మంది సభ్యులతో కూడిన ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు గుర్తించారు.  

 ఈ ప్రత్యేక బృందాలకు అప్పటి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్, అదనపు కమిషనర్ జయకామేశ్వరి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు.. పన్ను వసూళ్లు పెంచేందుకు ఏవిధంగా ముందుకెళ్లారనే విషయాలను రాబట్టేందుకు వారిని కూడా విచారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ఆరు ప్రత్యేక బృందాలకు నోటీసులు ఇచ్చారు.  మే 28, 29, 30 తేదీల్లో విచారణకు హాజరుకావాలని సూచించారు.

అయితే నెలాఖరులో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించే సమయం కావడంతో జూన్ మొదటి వారంలో విచారణకు హాజరవుతారని ఆ శాఖ కమిషనర్ సీఐడీ లేఖ రాశారు. దీంతో జూన్ 3, 4, 5తేదీల్లో రోజుకు పదిమంది చొప్పున విచారణకు హాజరుకావాలని అధికారులు సూచించారు.