calender_icon.png 24 October, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యలో పెట్టుబడి భవిష్యత్తుకు పునాది

23-10-2025 12:00:00 AM

- క్రమశిక్షణకు మారుపేరు విద్యా విలువలకు నిలయం.. గౌలీదొడ్డి గురుకులం

- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

శేరిలింగంపల్లి, అక్టోబర్ 22: విద్యలో పెట్టుబడి అంటే భవిష్యత్తును నిర్మించడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు అనుగుణంగా, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక చర్యలు చేపడు తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఎస్.ఆర్. శంకరన్ జయంతి సందర్భంగా గౌలీదొడ్డి గురుకులం (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో విద్యార్థులతో మమేకమై మాట్లాడుతూ, మంత్రి విద్య ప్రాముఖ్యతపై స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి పిఎసి చైర్మన్, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, ప్రిన్సిపాల్ అంజయ్య, కల్పన పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎస్.ఆర్. శంకరన్ సామాజిక న్యాయానికి ప్రతీక అని గుర్తుచేసి, ఆయన పేదలు, దళితులు, గిరిజనులు, బడుగు వర్గాల జీవితాల్లో వెలుగు నింపారని చెప్పారు. దళిత సంక్షేమానికి ప్రత్యేక హాస్టల్ వ్యవస్థను ప్రారంభించి, గురుకుల విద్యకు బలమైన పునాది వేసారని మంత్రి తెలిపారు. అధికారంలో ఉన్నవాడు దయ చూపడం కాదు,న్యాయం చేయాలనే సిద్ధాంతం ఇప్పటికీ ప్రభుత్వ విధానాలకు మార్గదర్శకం అవుతోందని ఆయన పేర్కొన్నారు.

శంకరన్ చూపిన మార్గం రాష్ర్ట సంక్షేమ విధానాలకు దిశానిర్దేశం చేస్తున్నదని, సీఎం రేవంత్ రెడ్డి ఆయన కలలను సాకారం చేస్తున్నారని మంత్రి తెలిపారు.విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, భద్రత, స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. పెండింగ్ బిల్లులను గ్రీన్ చానెల్ ద్వారా వెంటనే క్లియర్ చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి, యోగా, ధ్యానం, కౌన్సెలింగ్ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. చదువు గొప్ప ఆస్తి. ఎక్కడికి వెళ్లినా మీ చదువు మీ పరిచయం.

యోగా, ధ్యానం ద్వారా ఏకాగ్రత పెంపొందించుకోండి. క్రమశిక్షణను జీవిత భాగంగా చేసుకోండి. గురువులు, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండలాని విద్యార్థులకు సూచించారు.మీ సమస్యల పరిష్కారం కోసం నేను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ గౌలీదొడ్డి గురుకులం అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి కృషితో వేగంగా జరుగుతోందని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపిన స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.

డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి రూ.1.5 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యార్థుల కోసం మౌలిక వసతులు మరింత బలోపేతం చేస్తామని, ఇక్కడి విద్యార్థులు భవిష్యత్తులో రాష్ర్టం, దేశం గర్వించేటట్లు ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.