calender_icon.png 6 June, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతీకారానికి సై!

25-04-2025 12:00:00 AM

ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్‌ను భారత్ ఏకాకిని చేసింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో భారత ప్రభుత్వం ఎటువంటి తొందరపాటు నిర్ణయాలూ తీసుకోలేదు. అయితే, భారత్ తన నిరసన ద్వారా సౌదీ అరేబియా, అమెరికా, చైనా వంటి దేశాల ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిల్చోబెట్టిందని చెప్పొచ్చు.

పాక్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరుపుతున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ మారణకాండ గురించి తెలిసిన వెంటనే సౌదీ పర్యటనను ఉన్న ఫలంగా రద్దు చేసుకున్న ప్రధాని మోదీ హుటాహుటిన భారత్‌కు బయల్దేరి.. తన నివాసంలో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవహరాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ తన మద్దతును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా భారత్ డిమాండ్ చేసింది. అప్పటి వరకు 1960లో కుదుర్చుకున్న సింధూనదీ జలాల ఒప్పందాన్ని నిలిపి వేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది.

ఇరు దేశాల మధ్య ఉన్న అట్టారి చెక్‌పోస్టును మూసి వేయటంతోపాటు చెల్లుబాటయ్యే ధ్రువపత్రాలతో భారత్‌లోకి ప్రవేశించిన పాక్ పౌరులు మే 1వ తేదీలోగా తిరిగి వెళ్లిపోవాలని స్పష్టంచేసింది. సార్క్ వీసా మినహాయింపు పాలసీద్వారా భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీయుల అనుమతులనూ ప్రభుత్వం రద్దు చేసింది.

ఈ పాలసీ కింద పాక్ పౌరులు ఎవరైనా భారత్‌లో పర్యటిస్తుంటే 48 గంటల్లో వారందరూ దేశాన్ని వీడాలని వెల్లడించింది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను ఆమోదయోగ్యం కాని వ్యక్తులుగా ప్రకటిస్తూ దేశాన్ని వీడేందుకు వారం గడువు ఇచ్చింది. 

ఇదే సమయంలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో పని చేస్తున్న మన దేశ సైనిక సిబ్బంది, అధికారులను వెనక్కి పిలిచింది. అలాగే, ఇరుదేశాల హైమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గిస్తూ సీసీఎస్ సమావేశం సందర్భంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్థాన్‌తో భారత్ పూర్తిగా సంబంధాలను నిలిపి వేసినట్లయింది.

ముఖ్యంగా సింధూ జలాల నిలిపివేత, వీసాల రద్దు ద్వారా ఉగ్రవాదులకు మద్దతు ఉపసంహరించుకునేలా పాక్ ప్రభుత్వంపై సొంత దేశ ప్రజలే నిరసన తెలిపే పరిస్థితిని భారత్ కల్పించింది. సింధూ నదీ జలాలు పాకిస్థాన్‌లో 23.7 కోట్లమంది గొంతుకలను తడుపుతున్నది. అలాగే 16 లక్షల హెక్టార్లు ఈ నదీ జలాల ద్వారానే సాగవుతున్నాయి.

నదీ జలాల నిలిపివేత, వీసాల రద్దు నిర్ణయాల ద్వారా కోట్లాదిమంది పాక్ పౌరులు తీవ్రంగా ప్రభావితమవుతారు. వారందరూ తమ దేశ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తపరిచే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఈ చర్యలతోనే భారత ప్రభుత్వం సరిపెట్టుకోదని గురువారం ప్రధాని చేసిన వ్యాఖ్యలనుబట్టి అర్థమవుతున్నది.

పహల్గాం మారణకాండకు కారణమైన ఉగ్రవాదులను,  సూత్రధారులను ఊహకందని రీతిలో శిక్షిస్తామంటూ ప్రధాని ప్రతిజ్ఞ చేశారు. దీనిద్వారా ఉగ్రమూకల పీచమణచటానికి భారత ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి.