13-10-2025 01:35:52 AM
-ఏది కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలి
-ఉప ఎన్నికలో బుద్ధి చెబితేనే కాంగ్రెస్కు సోయి వస్తది
-కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్టే
-బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి పనికిరాని పార్టీ
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి) : కారు కావాలో.. బుల్డోజర్ కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నా రు. షేక్పేట్ డివిజన్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు చెర్క మహేష్ ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమ క్షంలో గులాబీ పార్టీలో చేరిన సందర్భం గా కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్న ఆ పార్టీ నాయకులు ప్రస్తుతం రాష్ట్రంలో రెండేళ్లుగా అధికారంలో ఉన్నదెవరో చెప్పాలన్నారు. ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తదని చెప్పారు. రెండేళ్లలో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్లో ఖర్చుపెడ తారని, కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ. 10 వేలు ఇస్తారని వెల్లడించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్టే అని అన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ మళ్లీ రావాల్సిందేనని, అది జూబ్లీహిల్స్ నుంచే మొదలు కావాలని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు రూ.4 వేల పెన్షన్లు వస్తాయని, ఎన్నికల కోసం చెప్పిన హామీలన్నీ అమలవుతాయని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రజలను తాము మోసం చేసినా ‘మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అని ఆ పార్టీ భావిస్తదన్నారు.
ఆరు గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లుగా ఒక్క మంచి పని కూడా చేయలేకపోయిందని విమర్శించారు. ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, కానీ రెండు లక్షల 30 వేల కోట్ల అప్పుల్ని మాత్రం చేసిందన్నారు. గరీబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి హైదరాబాద్లో రేవంత్రెడ్డి ఇళ్లు కూలగొట్టిస్తున్నారని పేర్కొన్నారు.
కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేమీ చూడకుండా పేదవాళ్ల ఇళ్లపైన బుల్డోజర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్రెడ్డి మోసం చేశారని స్పష్టం చేశారు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని, ఇచ్చిన జీఓను కోర్టు కొట్టేస్తుందని కూడా తెలిసినప్పటికీ బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశారని మండిపడ్డారు.
అజారుద్దీన్కు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్సీ కూడా ఆయనకు రాదని తెలిసి కూడా ఆయనను రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ముస్లింలకు ఇస్తామని చెప్పిన స్మశానం విషయంలో కూడా మోసం చేశారని గుర్తు చేశారు. తెలిసి మరీ ప్రజలను మోసం చేయడమే రేవంత్రెడ్డి నైజమని ఎద్దేవా చేశారు.
ఆయన నిజాయితీగా చెబుతూ మోసం చేస్తున్నారని, ఆయన గతంలోనే ‘మోసం చేసే వాళ్లనే ప్రజలు నమ్ము తారని’ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. రెండేళ్లుగా కేవలం కేసీఆర్ నామ జపం చేసి కాలం గడిపేశారని విమర్శించారు.