06-11-2025 07:10:23 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని మారుమూల ప్రాంతాల గిరిజనులకు సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జ ఆసిఫాబాద్ మండలం మాలన్ గొంది గ్రామంలో నెస్టిల్ స్వచ్ఛంద సంస్థ వరద ప్రభావిత గ్రామాలలో 14 రకాల నిత్యవసర సరుకులు పంపిణీ కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డిఓ లోకేశ్వర్ రావు, నెస్టిల్ ఇండియా లిమిటెడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులకు సహాయం అందించేందుకు నెస్టిల్ ఇండియా లిమిటెడ్ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.
వరద ప్రభావిత గ్రామాలలో నిరాశ్రయులకు 14 రకాల నిత్యావసర సరుకులు అందించారని, మారుమూల గిరిజన గ్రామాలలో కూడా ముందుకు వచ్చి సరుకులు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మంచి పోషక విలువలతో కూడిన సరుకులు అందిస్తున్నారని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అంతకుముందు గ్రామస్తులు అధికారులకు గుస్సాడీ నృత్యంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అలీబిన్ అహ్మద్, నెస్టిల్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు, గ్రామస్తులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.