06-11-2025 08:34:32 PM
నిరుపేద లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలి
లబ్ధిదారులకు ఆసక్తి లేని పక్షంలో ఇండ్లు రద్దు చేయాలి
మంథనిలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై సమీక్ష లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి (విజయక్రాంతి): మంథనిలో ఇందిరమ్మ ఇండ్ల పనుల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం మంథని నియోజకవర్గంలో మంథని ముత్తారం రామగిరి కమాన్ పూర్ మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంథని ఉన్న 4 మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు పురోగతి ఆశించిన స్థాయిలో లేదని పేర్కోన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన 45 రోజులలో నిర్మాణ పనులు ప్రారంభించిని పక్షంలో సదరు ఇండ్లను రద్దు చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆసక్తి చూపని లబ్ధిదారుల నుంచి ఆ ఇండ్లు రద్దు చేయాలని ఆదేశించారు.
మండలంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు 100% మార్కింగ్ చేసి లబ్ధిదారులంతా ఇండ్ల నిర్మాణం ప్రారంభించేలా చూడాలని, ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, మార్కింగ్ చేసిన ఇండ్లు బేస్మెంట్ స్థాయికి చేరుకునేలా హౌసింగ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలని సూచించారు. లబ్దిదారులకు పెట్టుబడి సమస్య ఉంటే మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించాలని, ఇండ్ల నిర్మాణ పురోగతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్, డి.పి.ఓ. వీర బుచ్చయ్య, ఎంపిడిఓ లు, సంబంధిత అధికారులు పాల్గోన్నారు.