06-11-2025 08:31:45 PM
కొండపాక: ఏమి పని చేయడం లేదని నాయనమ్మ మందలించడంతో మనవడు ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడిన సంఘటన కొండపాకలో గురువారం చోటుచేసుకుంది. కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు కొండపాక గ్రామానికి చెందిన తడకపల్లి కరుణాకర్(33) అనే యువకుడు తన తల్లిదండ్రులు మృతి చెందడంతో నాయనమ్మ లచ్చవతో కలిసి కొండపాకలో నివాసం ఉంటున్నాడు. కరుణాకర్ ఇంటి నిర్మాణం కోసం ప్రైవేట్ బ్యాంకులో తొమ్మిది లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు.
ప్రతినెల 14 వేల రూపాయలు బ్యాంకుకు వాయిదాలు చెల్లిస్తున్నాడు. ఏం పని లేకపోవడంతో నెల నెల కట్టాల్సిన సొమ్ము ఎలా అని నాయనమ్మ లచ్చవ్వ బుధవారం రాత్రి మందలించింది. నెలరోజుల నుంచి నీవు ఏ పనికి పోవడం లేదు నా ఆరోగ్యం బాగాలేదు, ఇంటికి సంబంధించిన రుణం ఎలా కడతావని మందలించింది. అదే రాత్రి లచ్చవ్వ గ్రామంలో ఉన్న మనవరాలు ఇంటికి వెళ్ళింది. కలత చెందిన కరుణాకర్ ఇంట్లో ఎవరూ లేనిది చూసి రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం చూసేసరికి వేలాడుతు కనబడ్డాడు. మృతుని సోదరి జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ తెలిపాడు.