30-09-2025 02:21:53 AM
తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి
ముషీరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా అన్ని అవాంతరాలను ఎదుర్కొని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయడం అభినందనీయమని తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
ఈ మేరకు సోమవారం కవాడిగూడలో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కార్యాలయంలో ఆయ న మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. దసరా పండుగతో పాటు ఓట్ల పండుగ గ్రామ గ్రామాల్లో జరుపుకుంటారని అన్నా రు.
ఒక వర్గంపై మరో వర్గం దూషణలకు, రాజకీయ విమర్శలకు స్వస్తి పలికి ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య, సామరస్య పూర్వకంగా ఎన్నికలలో పాలుపంచుకొని తెలంగాణ గ్రామీణ ప్రాంత అభివృద్ధికై కంకణ బద్ధులవుతారని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి తన మంత్రివర్గ అనుచరులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.