calender_icon.png 4 June, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యత మాదే

03-06-2025 01:24:31 AM

- బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలన వైఫల్యాలమయం

- తెలంగాణకు రూ.10 లక్షల కోట్ల అప్పులపాలు 

- ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చేది బీజేపీనే

- రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం.. ఒట్టేసి చెబు తున్నా, రాష్ట్రాన్ని నీతి, నిజాయితీతో, అంకితభావంతో అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీ తీసు కుంటుంది.. ఇది బీజేపీ మాట.. ప్రధాని నరేంద్రమోదీ మాట అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ కోసం 1,200 మందికిపైగా ప్రాణత్యాగాలు చేశారని, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు ఆందోళనలు కొనసాగాయని చెప్పారు. అన్ని పార్టీలకంటే ముందుగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న... జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీయేనని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబా ద్‌లోని బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్త లు పెద్దఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కిషన్‌రెడ్డి, బీజేపీ తరఫున శుభాకాం క్షలు తెలిపారు.

తెలంగాణ సాధన కోసం జ రిగిన ఉద్యమం.. ప్రపంచ చరిత్రలో అహింసాయుతంగా సాగిన, ప్రబలమైన పోరాటంగా గుర్తించదగ్గదని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ పోరాడిందని, నీళ్లు, నిధు లు, నియామకాల కోసం పార్లమెంట్‌లో గళమెత్తిందని తెలిపారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని, ప్రజలకు మాత్రం ఆశించిన ఫలితాలు లభించలేదన్నారు.

మిగులు బడ్జెట్‌తో పురుడుపోసుకున్న తెలంగాణ.. ఈరోజు రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఇది బీఆర్‌ఎస్, కాంగ్రె స్ పార్టీల ఘనత అని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  రెండూ అవినీతి, కుటుంబ పార్టీలు, ప్రజలను మోసం చేశాయని  విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పున: నిర్మించాలంటే బీజేపీనే ప్రత్యామ్నాయమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నీతి, నిజాయతీతో అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు.

వేల కోట్ల రూపాయలను సాగునీటి ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఉద్యమకాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు, లాఠీలతో విరుచుకుపడినప్పుడు.. దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు తెలంగాణ యువతకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత ప్రజలు, మేధావులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కేసీఆర్ హామీ ఇచ్చిన బంగారు తెలంగాణ సాధించలేదని, ఆయన కుటుంబం మాత్రం బంగారమైందని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలొస్తాయనుకుంటే కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉపాధి వచ్చాయన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడిపారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గతంలో  సోనియాగాంధీని తెలంగాణ పాలిట దేయం అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి రాగానే ఆమెను దేవతగా అభివర్ణించడం ఆయన ద్వంద్వనీతిని ప్రదర్శిస్తోందన్నారు.

కేసీఆర్ కుటుంబ పాలన, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల దోపిడీ పాలనకు తెరదించాలని, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ, తమిళనాడు, మహారాష్ట్ర సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.