మొగిలిపేటలో జలసిరి గ్రామ సభ నిర్వహణ
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గోల్కొండ కళ రమేష్ ఆధ్వర్యంలో గురువారం జలసిరి గ్రామ సభ నిర్వహించారు. తెలంగాణలో భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామ సభ జరిగింది. కార్యక్రమానికి ఎంపీడీవో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ), జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలలను సందర్శించారు.
విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, భోజనం నాణ్యతపై విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను అధికారులకు అందించారు. అలాగే గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసిన బీఎల్వోలను అభినందించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దండవేణి రాజేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, వార్డు సభ్యులు దండవేణి సోమరాజు, జంగ ప్రణయ్, వర్ధ సురేష్, గంగుల జగదీశ్వర్, గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






