13-08-2025 01:09:30 AM
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ రెండో విడత కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 24న ఉమ్మడి కరీంనగర్లోని చొప్పదండి నియోజకవర్గంలో జనహితయాత్రను ఆయన ప్రారంభించనున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించడం, పార్టీ కార్యకర్తల సమా వేశాలు నిర్వహించడంతో పాటు శ్రమదానాలు చేపట్టనున్నారు.
మొదటి విడతలో రంగారెడ్డి జిల్లా పరిగి, ఉమ్మడి మెదక్లోని ఆందోల్, ఉమ్మడి నిజాబాబాద్లోని ఆర్మూర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజక వర్గాల్లో మహేశ్గౌడ్ జనహిత పాదయాత్ర నిర్వహించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టడంతో.. మొదటి విడతయాత్రను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
తిరిగి ఈ నెల 24 నుంచి రెండో విడత యాత్రను చొప్పదండి నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నారు. వర్దన్నపేటలో పాదయాత్ర తర్వాత 26న సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సమావేశం కానున్నారు.
జనహితయాత్ర షెడ్యూల్..
* చొప్పదండి నియోజకవర్గంలో 24న తేదీన సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్ర, 25న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రమదానం, ఉదయం 10:30 గంటల నుంచి కరీంగనర్ జిల్లా కార్యకర్తలతో సమావేశం
* 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరంగల్ జిల్లాలోని వర్దన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర, 26వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రమదానం, ఉదయం 10:30 గంటల నుంచి వరంగల్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం
* 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం.
నేడు డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి జూమ్మీటింగ్
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ బుధవారం మధ్యా హ్నం 1 గంటకు జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, జనహిత పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి చర్చించనున్నారు.