జయశంకర్ ఆశయాలు యువతకు స్ఫూర్తి
- డీటీఓ శ్రీనివాస్
వేములవాడ,(విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్ ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతిని పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. జిల్లా రవాణా శాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ సిబ్బందితో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డీటీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని, స్ఫూర్తిదాయకమని అన్నారు.






