19-06-2025 01:28:24 AM
టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి సానుకూలంగా స్పందించిన కలెక్టర్
నిజామాబాద్ జూన్ 18: (విజయ క్రాంతి): జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) ప్రతినిధులు కలెక్టర్ టీ వినయ్ కృష్ణ రెడ్డిని కోరారు. జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించగా బుధవారం టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇండ్లు, ఇళ్ల స్థలాల అంశంపై జర్నలిస్ట్ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీ డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏం భాస్కర్ ఏ రామచందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా మండలాలు, జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఇండ్లు, ఇళ్లస్థలాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
చాలీచాలని వేతనాలతో బతికీడుస్తున్న జర్నలిస్టులకు... అద్దెలు ఆర్థిక భారంగా మారుతున్నాయని వివరించారు. జర్నలిస్టుల కోసం గతంలో గుండారం శివారులో స్థల పరిశీలన జరిగినా.. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని వాపోయారు. ఈ అంశంపై కలెక్టర్ టీ వినయ్ కృష్ణరెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని హామీనిచ్చారు.
ఇళ్ల స్థలాల పంపిణీలో సాంకేతిక, రాజకీయ సమస్యలు లేకుండా పరిష్కారం లభించేలా చొరవ చూపుతానన్నారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేశ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అనిత, ప్రజా దర్బార్ పరమేశ్వర్, ప్రతినిధులు మధు, రాజు, నరేష్, వినీష్ తదితరులు పాల్గొన్నారు.