08-12-2025 12:11:54 AM
హైదరాబాద్, డిసెంబర్ 7 : స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్(జేపీఎల్) రెండో సీజన్ పోటీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగిన ప్రారంభో త్సవానికి మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ లీగ్లో ఆడుతున్న పది మీడియా జట్ల జెర్సీలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం టాస్ వేసి తొలి మ్యాచ్ ను ప్రారంభించారు. నిత్యం వార్తా సేకరణలో బిజీగా ఉండే జర్నలిస్టులకు ఇలాంటి ఆటవిడుపు ఖచ్చితంగా అవసరమని హరీశ్రావు అన్నారు. ఆరోగ్యంపై శ్రద్ద వహించి, అప్పుడప్పుడూ క్రీడల్లో కూడా పాల్గొనాలని జర్నలి స్టులకు సూచించారు.
ఐదురోజుల పాటు లీగ్ను చక్కగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా 80 ఏళ్ళ వయసులో సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్లో పతకాలు సాధిస్తున్న ఎంఎల్ఆర్ఐటీ ఛైర్మన్ లక్ష్మారెడ్డిని ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.