30-07-2025 01:20:58 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 29 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మంగ ళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరానగర్ భద్రాచలం క్యాంప్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గా పక్కా లోకల్ క్యాండిడేట్నే రంగంలోకి దింపనున్నట్లు స్పష్టం చేశారు.
టికెట్ ఎవరికి కేటాయించాలన్న విషయాన్ని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని, అభ్యర్థి ఎవరైనా ఐక్యంగా పని చేసి కాంగ్రెస్ జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బలమైన అభ్యర్థి కోసం క్షేత్ర స్థాయిలో సర్వే చేయిస్తున్నట్లు, టికెట్ అభ్యర్థిస్తున్న నేతల్లో కొందరు స్థానిక నాయకులకు సానుకూలమైన మార్కులు వస్తున్నట్లు ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ క్యాడర్ కూడా లోకల్ లీడర్కు అవకాశమిస్తే గెలిపించుకుంటామని చెపుతుండటంతో, వారి అభ్యర్థన మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఉండనుందని ఆయన వివరించారు.